
- మొదటి విడతలో నిరుపేదలకు ప్రాధాన్యం
- అధికారులు సమన్వయంతో పనిచేయాలి
- జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ, మన చౌరాస్తా : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాలను ఈ నెల 26 నుంచి ప్రారంభించనున్నట్టు జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. పథకాల లబ్ధిదారుల ఎంపిక నిరంతరంగా కొనసాగుతుందని ఆయన చెప్పారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ తో కలిసి కలెక్టర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల వారీగా ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఎంఏఓలు, మండల ప్రత్యేక అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పథకాల అమలు విధివిధానాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమలును జనవరి 26న ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా, మండల స్థాయి అధికారులందరూ నిబద్ధతతో పనిచేయాలని పేర్కొన్నారు.
గ్రామ సభలను పక్కాగా నిర్వహించాలని, ఈ నెల 16 నుంచి 20 వరకు చేపట్టే క్షేత్రస్థాయి సర్వేలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను సజావుగా పూర్తిచేయాలని, అలాగే 16 నుంచి 20 వరకు లబ్ధిదారుల ముసాయిదా జాబితా తయారీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ సభలు పక్కాగా జరిగే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని, 21 నుంచి 25 వరకు డేటా ఎంట్రీలో తప్పులు దొర్లకుండా చూడాలని, ఫ్లెక్సీ లు, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులో ప్రచురించాలని, గ్రామ సభల్లో వచ్చే ఫిర్యాదులపై రిజిస్టర్ లను, కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి, అర్జీలను స్వీకరించాలని, ఈ సర్వే, గ్రామ సభల పట్ల ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని, విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
రైతు భరోసా పథకం..
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు వ్యవసాయ యోగ్యమైన భూములకు పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 6000 చొప్పున రెండు విడతలుగా రూ.12 వేలు భూ భారతి (ధరణి) పోర్టల్ లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమికి మాత్రమే రైతు భరోసా చెల్లిస్తుందని, అలాగే ఇళ్లు (లేదా) కాలనీలుగా మారిన అన్ని రకాల భూములు, రియల్ ఎస్టేట్ భూములు, లేఅవుట్ చేసిన భూములు, నాలా కన్వర్షన్ చేసిన భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, గోదాములు నిర్మించిన భూములు, వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు, రాళ్ళు, రప్పలు, గుట్టలతో నిండి, సాగుకు అనువుగా లేని భూములను గుర్తించి, తొలగించాలని సూచించారు. భూముల జాబితాను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత జాగ్రత్తగా రూపొందించాలని, ఈ జాబితాను గ్రామ సభల్లో ప్రదర్శించాలని, చదివి వినిపించాలని, చర్చించిన తర్వాతనే వెల్లడించాలని తెలిపారు.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబానికి రూ. 6000 చొప్పున రెండు విడతలుగా రూ. 12,000 నగదు సాయం అందించనున్న నేపథ్యంలో 2023-–24 సంవత్సరానికి గాను కనీసం 20 రోజులు ఉపాధి హామీ పని దినాలు పూర్తిచేసుకున్న భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.
కొత్త రేషన్ కార్డులు…
కొత్త ఆహార భద్రత కార్డులు (రేషన్ కార్డులు) పథకంలో భాగంగా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. రాష్ట్ర స్థాయి నుంచి అన్ని జిల్లాల వారీగా కుల గణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని పేద కుటుంబాల జాబితా ప్రకారం పరిశీలించాలని, ఇందుకోసం జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ), డీసీఎస్ఓ పర్యవేక్షకులుగా వ్యవహరించాలని, మండల స్థాయిలో ఎంపీడీఓ, మున్సిపాలిటీలో మునిసిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా ఉంటారని, అలాగే భూములు, ఆదాయం తదితర అంశాలను రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు గుర్తించాలని, పంచాయతీ కార్యదర్శులు కుటుంబాల వివరాలను సేకరించాలని సూచించారు.
అందుకు సంబంధించిన ఫీల్డ్ వెరిఫికేషన్ ఫార్మ్ లో కుటుంబాల సమగ్ర వివరాలను తప్పులు లేకుండా నమోదు చేసి, ఈ ముసాయిదా జాబితాను గ్రామ, వార్డు సభల్లో ప్రదర్శించాలని, చదివి వినిపించాలని, చర్చించిన తర్వాతే అమోదించడం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే ఒక రేషన్ కార్డు ఒక వ్యక్తికి ఒకే చోట ఉండాలన్నారు. గ్రామీణంలో వార్షిక ఆదాయం రూ. 1.50 ఉండాలని, అర్బన్ లో రూ. రెండు లక్షలుగా ఉండాలన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం..
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జీఓ నంబర్ 7 ప్రకారం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న గృహాలు, ఇళ్లు లేనివారు, పూరిగుడిసెలు ఉన్నవారు, అద్దె ఇళ్లలో నివాసం ఉన్నవారు, నిర్మాణానికి స్థలం ఉన్నవారు అర్హులను తెలిపారు. ఇందులో భాగంగా మట్టి గోడలు, పైకప్పు లేని గృహాలు, వితంతువులకు, భూమిలేని వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ఇందుకోసం ఈ నెల 18 లోగా ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్ లాగిన్ లలో ఎటువంటి లోపాలు దొర్లకుండా సూపర్ చెక్ ను పూర్తి చేయాలని ఆదేశించారు. ఒక కుటుంబానికి ఒకటే ఇల్లు కేటాయించేందుకు ఏఐ, జియో ట్యాగింగ్ ద్వారా డీడూప్లికేషన్ చేయాలని సూచించారు. అలాగే ఏమైనా పొరపాట్లు ఉంటే పీడీ హౌసింగ్ కు పంపించాలని, వివరాలను సరిదిద్దేందుకు ఎడిట్ ఆప్షన్ కల్పించినట్లు వివరించారు. సమీక్షలో జనగామ, ఘనపూర్ (స్టేషన్) ఆర్డీవోలు గోపీరామ్, వెంకన్న, యూనిట్ 1, 2ల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, ఏఓ మన్సూర్, డీఆర్డీఏ వసంత, డీపీఓ స్వరూప, డీఏఓ రామారావు నాయక్, డీసీఎస్ఓ సరస్వతి, మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఏడీ సర్వే అండ్ ల్యాండ్స్ మన్యంకొండ, అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, మునిసిపల్ ప్రత్యేక అధికారులు, అన్ని మండలాల ఎంపిడిఓలు, ఎంఏఓలు, డిప్యూటీ తహసీల్దార్ లు, ఆర్ఐలు, ఏఈఓలు, సర్వేయర్ లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.