
బచ్చన్నపేట, మన చౌరాస్తా : బచ్చన్నపేట మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలలో యాసంగి పంటకు నీరు అందక వరి పంట ఎండిపోవడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఆందోళన పడుతున్నారని సర్పంచ్ ఫోరం మాజీ మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పందిపిల్లి సిద్ధిరామిరెడ్డి లు అన్నారు. బచ్చన్నపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలకు వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం స్థానిక చౌరస్తాలో వివిధ గ్రామాల రైతులతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ తొమ్మిది సంవత్సరాల పాలనలో గోదావరి జలాలతో బచ్చన్నపేట మండలం సస్యశ్యామలమైందని అన్నారు. గతంలో మాదిగానే ఈ సంవత్సరం గోదావరి నీళ్లు వస్తాయని ఉద్దేశంతో ప్రతి రైతు తన పొలంలో వరి పంట వేశారన్నారు. పంట పొట్ట దశకు రాగానే భూగర్భ జలాలు అడుగున పడడంతో పంట పొలాలకు నీరు సరిపోక గోస పడుతున్నారని అన్నారు. గత పదిహేను రోజుల క్రితం నుండి గోదావరి జలాల కోసం రైతన్నలు ఎదురు చూడగా అధికార కాంగ్రెస్ నాయకులు రేపు మాపు వస్తాయని మోసపు మాటలు కాలం వెల్లదీస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే గోదావరి జలాలను విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.