
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు
- 3 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ
- రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
జనగామ, మన చౌరాస్తా : ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ఆయన టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, అలాగే జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఏఎస్పీ పండారి చేతన్ నితిన్, జెడ్పీ సీఈఓ మాధురీ షా, ఇతర సంబంధిత నోడల్ అధికారులతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్,- నిజామాబాద్-, మెదక్ -ఆదిలాబాద్ ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుల స్థానానికి, ఉమ్మడి నల్గొండ-, ఖమ్మం, -వరంగల్ ఉపాధ్యాయుల స్థానానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. ఈ క్రమంలో అన్ని జిల్లాల వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని, 24 గంటలు, 48 గంటలు, 72 గంటలలో తీసుకోవాల్సిన చర్యలపై నివేదికను అందించాలన్నారు.
రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగ్ లు, గోడ రాతలు, జెండాలు, ప్రకటనలను తొలగించాలన్నారు. ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న విడుదల చేయడం జరుగుతుందని, ఈ మేరకు ఫిబ్రవరి 3 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన, 13లోపు ఉపసంహరణ గడువు ఉంటుందని, 27న పోలింగ్ జరుగుతుందని, మార్చి 3న ఫలితాలు ఉంటాయని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను రూపొందించాలని, పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ ఓటరు దరఖాస్తులను పరిశీలించి, ఫిబ్రవరి 7లోపు పరిష్కరించాలని సీఈఓ సూచించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి జిల్లాలో ఎంసీఎంసీ కమిటీలను వెంటనే ఏర్పాటు చేసి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రసారాలను పర్యవేక్షించాలన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి అలసత్వం వహించరాదన్నారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, అక్కడ అవసరమైన వసతులను కల్పించాలని, ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా తగు జాగ్రత్త చర్యలతో సన్నద్ధంగా ఉండాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉపాధ్యాయులకు సంబంధించి 12 మండలాల పరిధిలో 921 మంది ఓటర్లు ఉన్నారని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరిస్తూ సంబంధించిన నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని సీఈఓ కు వివరించారు. వీడియో సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్ నాయక్, ఆర్డీవో గోపీరాం, డీఏఓ రామారావు నాయక్, సంబంధిత నోడల్ అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.